ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళ్ల బేరానికి వచ్చిన మాల్దీవులు అధ్యక్షుడు.. అప్పుల బాధను తగ్గించాలని విజ్ఞప్తి

national |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:49 PM

మాల్దీవులు అధ్యక్షుడిగా గతేడాది ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు భారత్ పట్ల తన అక్కసు మొత్తాన్ని గత కొన్ని నెలలుగా వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భారత వ్యతిరేకిగా.. చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మహ్మద్ ముయిజ్జు.. చైనాతో చేతులు కలిపి భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే మాల్దీవులు గడ్డపై నుంచి భారత సైన్యాన్ని వెళ్లగొట్టడం.. అదే సమయంలో చైనాతో కీలకమైన ఆయుధ ఒప్పందాలు చేసుకోవడంతో భారత్ - మాల్దీవులు మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాలు దూరం అవుతున్న తరుణంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం మాల్దీవులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని.. సహాయం చేయండి మహా ప్రభో అంటూ భారత్‌ను అర్థిస్తున్నారు.


మాల్దీవులకు భారతదేశం ఎప్పటికీ మిత్రదేశంగానే కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తాజాగా వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మహ్మద్ ముయిజ్జు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతేడాది మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో ఘర్షణకు దిగుతున్న మహ్మద్‌ ముయిజ్జు ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సందర్భంగా భారత్ నుంచి రుణవిముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. 2023 చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు అంటే సుమారుగా రూ.34 వేల కోట్లు బకాయిపడింది. దీన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఉపశమనం కలిగించాలని ప్రస్తుతం మాల్దీవులు అధ్యక్షుడు భారత్‌ను ప్రాధేయపడుతున్నారు.


 ఎప్పటి నుంచో మాల్దీవులకు సాయం అందించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించిందని మహ్మద్ ముయిజ్జు తెలిపారు. మాల్దీవుల్లో పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను భారత్ నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని ఈ సందర్భంగా భారత్‌ను కోరారు. అయితే మాల్దీవుల్లోని గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాల వల్ల భారత్‌ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఈ అప్పులు చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ముయిజ్జూ వెల్లడించారు.


ఈ సందర్భంగానే ప్రస్తుతం మాల్దీవుల్లో భారత్‌ నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టుకు కూడా తమ ప్రభుత్వం అడ్డంకులు కలిగించదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సహకరిస్తామని ముయిజ్జు తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో దుబాయి వేదికగా జరిగిన కాప్‌ 28 సదస్సు సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. మహ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


మానవతాసాయం కింద మాల్దీవుల్లో భారత్‌ గత కొన్నేళ్లుగా అత్యవసర వైద్యసేవలు అందిస్తోంది. ఇండియన్ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్‌ విమానం అక్కడ సేవలు అందిస్తోంది. గత ఐదేళ్లలో దాదాపు 80 మంది సిబ్బంది మాల్దీవుల్లో మారుమూల ప్రాంతాల్లోని 600 మందిని అత్యవసర చికిత్స కోసం భారత్‌కు తరలించారు. అయితే ఆ సిబ్బంది అంతా మే 10 వ తేదీ లోపు తిరిగి భారత్ వెళ్లిపోవాలని గత కొన్ని నెలలుగా ముయిజ్జు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌ను పొగుడుతూ ముయిజ్జు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com