ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవినేని ఉమా మౌన పోరాటం.. మైలవరం టిక్కెట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తల ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 10:12 PM

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నారు. కానీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అలియాస్ దేవినేని ఉమాది మాత్రం భిన్నమైన పరిస్థితి. తన నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తున్నా కూడా.. ఆయనకు నిరాశే ఎదురైంది. ఉమాను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇటీవలే పార్టీలో చేరిన వసంతకృష్ణప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. సర్వేల ఆధారంగా ఉమాను కాదని చంద్రబాబు.. వసంతకృష్ణ ప్రసాద్ వైపే మొగ్గుచూపారు.


దేవినేని కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో చక్రం తిప్పుతూ వచ్చింది. 1983 నుంచి 2019 ఎన్నికల వరకూ దేవినేని కుటుంబసభ్యులు ఈ జిల్లాలో టీడీపీ తరుఫున పోటీ చేస్తూ వచ్చారు. 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. 1999లో దేవినేని వెంకటరమణ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దేవినేని ఉమామహేశ్వరరావు.. నందిగామ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004లోనూ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2009, 2014లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా.. వరుసగా విజయాలు సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ కీలక నేతగా ఎదిగారు.


అయితే 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీచేసిన దేవినేని ఉమా.. వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్ని్స్తూ వచ్చారు. ఇసుక అక్రమాలపై పోరాటం సందర్భంగా అరెస్ట్ కూడా అయ్యారు. అయితే ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు టీడీపీ మైలవరం టికెట్ ఇచ్చింది. దేవినేని ఉమాకు పెనమలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బోడె ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో దేవినేని ఉమా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.


ఈ నేపథ్యంలోనే మైలవరంలో తెలుగుతమ్ముళ్లు రోడ్డెక్కారు. కార్యకర్తలతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు మౌన ర్యాలీ చేపట్టారు. వసంత కృష్ణప్రసాద్ వద్దు ..ఉమా ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వసంత కృష్ణప్రసాద్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదనీ.. మైలవరం టికెట్ దేవినేని ఉమాకే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరి.. మైలవరం పంచాయతీని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com