ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నీ తెలిసే సిరియాకు ప్రయాణం.. ‘ఐసిస్‌ పెళ్లికూతురి’కి మరోసారి షాకిచ్చిన కోర్టు

international |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 10:34 PM

పదిహేనేళ్ల వయసులో సిరియాకు పారిపోయి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలో చేరిన బ్రిటన్‌కు చెందిన షమీమా బేగం.. తిరిగి యూకే పౌరసత్వం కోసం న్యాయపోరాటం చేస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదిని వివాహం చేసుకున్న ఆమెను ‘ఐసిస్‌ పెళ్లికూతురు’గా వ్యవహరించేవారు. తనను తిరిగి బ్రిటన్ పౌరురాలిగా గుర్తించాలని కోరుతూ షమీమా బేగం వేసిన పిటిషన్‌ను ‘స్పెషల్‌ ఇమిగ్రేషన్‌ అప్పీల్స్‌ కమిషన్‌’ గతంలో తిరస్కరించింది. తాజాగా, అప్పీల్‌ కోర్టు ఎస్ఐఏసీ తీర్పుతో ఏకభవించింది. ఆమె అన్నీ తెలిసే సిరియాకు వెళ్లి ఉగ్రవాదులతో చేరాలని నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించింది.


‘షమీమా బేగంను ఇతరులు ప్రభావితం చేసి ఉండొచ్చు.. కానీ, సిరియాకు వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే అంశంలో అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారు’ అని పేర్కొంది. 24 ఏళ్ల షమీమా ప్రస్తుతం ఉత్తర సిరియాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకుంటోంది. బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన షమీమా బేగం 2015 ఫిబ్రవరిలో యూకే నుంచి సిరియాకు వెళ్లిపోయింది. తూర్పు లండన్‌లోని బెథ్నల్‌ గ్రీన్‌ పాఠశాలలో చదువుతున్న ఆమె వయసు అప్పటికి 15 ఏళ్లు. ఆమె వెంట మరో ఇద్దరు బాలికలు కూడా వెళ్లారు. అక్కడే డచ్‌కు చెందిన ఐసిస్‌ ఉగ్రవాది యగో రీడ్జిక్‌ను పెళ్లి చేసుకుంది. దాంతో షమీమాను ‘ఐసిస్‌ పెళ్లికూతురు’ అని పిలిచేవారు.


వీరికి ముగ్గురు పిల్లలు పుట్టినా.. ఒక్కరు కూడా దక్కలేదు. అయితే, 2019 ఫిబ్రవరిలో సిరియా శరణార్థుల శిబిరంలో ఆమె ప్రత్యక్షం కావడంతో బ్రిటన్‌ హోంశాఖ ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే, తిరిగి స్వదేశంలో అడుగుపెట్టడానికి షమీమాకు అవకాశం కల్పించకూడదంటూ 2021లో యూకే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జాతీయ భద్రత ముందు ఏదీ ప్రధానం కాదని, ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనని హోంశాఖ నిర్ణయాన్ని సమర్ధించింది. దీనిపై ఆమె అప్పీల్‌కు వెళ్లగా 2022లో తన నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


దీంతో స్పెషల్‌ ఇమిగ్రేషన్‌ అప్పీల్స్‌ కమిషన్‌ ఆశ్రయించిన షమీమా.. తాను మానవ అక్రమ రవాణా బాధితురాలిగా చెప్పుకొంది. అయితే, పౌరసత్వం రద్దుకు హోంశాఖ ఈ విషయాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని కమిషన్‌ తీర్పు చెప్పింది. దీన్ని సవాల్‌ చేయగా మరోసారి న్యాయమూర్తులు ఏకగ్రీవంగా తీర్పును సమర్దించారు. షమీమా బ్రిటీష్ పౌరసత్వాన్ని తొలగించే నిర్ణయం కఠినమైందా లేదా ఆమె తన దురదృష్టానికి బలైందా అని నిర్ణయించడం న్యాయస్థానం పని కాదు అని వ్యాఖ్యానించారు. ‘షమీమా బేగం ఇతరులతో ప్రభావితమై ఉండొచ్చు.. ఎవరైనా నియంత్రించి ఉండొచ్చు.. కానీ అన్నీ తెలిసిన తర్వాతే సిరియాకు వెళ్లి ఐసిస్‌తో జతకట్టడానికి నిర్ణయం తీసుకుంది’ అని న్యాయమూర్తి జస్టిస్ డేమ్ స్యూ కార్ అన్నారు. మరోవైపు, ఆమె బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోరుతుందని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఆమె కుటుంబసభ్యులు మాత్రం యూకే పౌరురాలైన తమ కుమార్తె బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఎప్పుడూ కోరలేదని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com