ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ వ్యక్తిని పెళ్లాడిన భారతీయ యువతి.. ఇస్లాం మతంలోకి మార్పు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 11:32 PM

సోషల్ మీడియా విస్తృతం అయినాకొద్దీ ప్రపంచం అరచేతిలోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే బంధాలు రాష్ట్రాలు, దేశాలు దాటి.. విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఇక ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయాల కోసం రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్తున్నారు. తమకు కావాల్సిన వారిని పెళ్లి చేసుకునేందుకు మతం, దేశం కూడా మారుతున్నారు. ఇక ఇటీవల మరీ ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌కి చెందిన పలువురు యువతీ యువకులు ప్రేమించుకున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ మహిళ, పబ్జీ ద్వారా పరిచయమైన సచిన్ మీనా కోసం భారత్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. తాజాగా భారత్‌కి చెందిన ఓ యువతి పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించింది. అతని కోసం ఏకంగా మతం మార్చుకుని పెళ్లి కూడా చేసుకుంది.


పంజాబ్‌కు చెందిన జస్ప్రీత్ కౌర్ అనే యువతి ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ సియాల్‌కోట్‌కి చెందిన యువకుడు అర్సలాన్‌ను పెళ్లి చేసుకుంది. లుథియానాకు చెందిన జస్ప్రీత్ కౌర్ పెళ్లికి ముందు తన పేరును జైనబ్‌గా మార్చుకుంది. జామియా హనాఫియా సియాల్ కోట్ జారీ చేసిన సర్టిఫికేట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే జస్ప్రీత్ కౌర్, ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాగా.. వారు జర్మనీలో స్థిర పడ్డారు. జస్ప్రీత్ కౌర్, అర్సలాన్‌ తొలిసారి జనవరి 16 వ తేదీన పాకిస్తాన్‌లో కలుసుకున్నారు. మతపరమైన యాత్ర కోసం ఆమె ఏప్రిల్ 15 వ తేదీ వరకు జస్ప్రీత్ కౌర్‌కు వీసా లభించింది. ఈ క్రమంలోనే మ్యూనిచ్ నుంచి ఆమెకు ఇండియన్ పాస్‌పోర్టుపై వీసా లభించింది. జస్ప్రీత్, ఆమె తల్లిదండ్రులు భారతీయులేనని.. అయితే వారు జర్మనీలో నివసిస్తున్నారని జామియా హనీఫియా సియాల్‌కోట్ అధికారులు తెలిపారు.


పాకిస్థాన్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జామియా హనాఫియాలో ఇస్లాం మతంలోకి మారిన 2 వేల మందికి పైగా ముస్లిమేతరులలో జస్ప్రీత్ కౌర్ ఒకరు. జస్ప్రీత్, అర్సలాన్ ముందుగా విదేశాల్లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జస్ప్రీత్ కౌర్‌ను అర్సలాన్ పాకిస్తాన్‌కు ఆహ్వానించాడని.. ఆ తర్వాత జస్ప్రీత్ మతపరమైన యాత్ర కోసం పాక్ వీసా దరఖాస్తు చేసుకుంది. జనవరి 16 వ తేదీన జస్ప్రీత్ పాకిస్తాన్ చేరుకోగా.. ఆ తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించి వివాహం చేసుకుందని తెలుస్తోంది.


ఇటీవల కాలంలో సీమా హైదర్ మాత్రమే కాకుండా.. జోధ్‌పూర్ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అమీనా అనే యువతి కూడా పాక్ నుంచి భారత్‌కు వచ్చేసింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంజూ థామన్ అనే వివాహిత భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లింది. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త, పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత అంజూ క్రిస్టియన్ నుంచి ఇస్లాం మతంలోకి మారి ఫాతిమా అనే పేరు మార్చుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com