ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్షా పే చర్చ.. విశాఖ టీచర్ ప్రశ్నకు ప్రధాని మోదీ ఆసక్తికర సమాధానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2024, 06:48 PM

సోమవారం జరిగిన పరీక్షాపే చర్చ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశవ్యాప్తంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని తల్లిదండ్రులకు మోదీ సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మ్యూజిక్ టీచర్ సి. సంపత్‌రావు అడిగిన ప్రశ్నకు ప్రధాని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య అనుబంధం.. తరగతి గది, పరీక్షల వరకే పరిమితం కారాదని పేర్కొన్నారు.


ఇరువురి మధ్య ఆత్మీయబంధం నెలకొనాలని మోదీ సూచించారు. ‘పరీక్షల సమయంలో తీవ్ర ఒత్తిడికి గురువుతోన్న విద్యార్థుల్లో ఆందోళన తొలగించాలన్నదే నా లక్ష్యం.. అందుకు మార్గనిర్దేశం చేయండి’ అంటూ సంపత్‌రావు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రధాని సమాధానం ఇస్తూ... ‘ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య బంధం తరగతి గది, పరీక్షల వరకే పరిమితం కాకూడదు.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు సంప్రదించి తమ మనసులోని సందేహాలను చెప్పుకొనే పరిస్థితి ఉండాలి.. అలాంటి సంబంధం ఉంటే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదు. విద్యార్థుల ప్రతిభచూపినప్పుడు టీచర్లు వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేస్తే మొత్తం వాతావరణమే మారిపోతుంది’ అని ప్రధాని అన్నారు.


పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలనే అంశంపై గత ఏడేళ్లుగా ప్రధాని పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక, పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదని మోదీ సలహా ఇచ్చారు. విద్యార్థులు తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేక ఒత్తిడికి లోనవుతారని, ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు


అలాగే, పిల్లలను మరొకరితో పోల్చకూడదని, అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుందని తల్లిదండ్రులకు హితవు పలికారు. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో వారిలో ప్రతికూల ఆలోచనలు మొదలై.. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com