ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో కాంగ్రెస్ కొంపముంచింది అదే.. ఏపీ మాజీ మంత్రి విశ్లేషణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 06:34 PM

ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసనభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణవ్యాప్తంగా హస్తం పార్టీ జోరు చూపించింది. ఖమ్మం, నల్గొండ సహా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం హస్తం పార్టీ డీలాపడింది. ఇబ్రహీంపట్నం మినహా మిగతా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. గెలుస్తారని ఆశించిన నాంపల్లిని కూడా కాంగ్రెస్ సొంతం చేసుకోలేకపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సత్తాచాటాయి. మిగతా ప్రాంతాలను పక్కనపెడితే హైదరాబాద్ ‍‌ ఓటర్లు మాత్రం గులాబీ పార్టీకే పట్టం కట్టారు. అయితే దీని వెనుక గల కారణాన్ని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ విషయంలో తన విశ్లేషణ ఏంటో మీడియాకు తెలిపారు.


హైదరాబాద్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన సెటిలైనవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ సెటిలర్లకు ఇక్కడ ఓటుహక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటమికి, టీడీపీతో రాసుకు, పూసుకు తిరగడమే కారణమని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు టీడీపీ, బీజేపీకి జనసేన సపోర్ట్ చేశాయన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌, టీడీపీ కలిసి తిరగడం ఓటర్లకు నచ్చలేదన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చిందని అంచనా వేశారు. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్‌కి మద్దతిస్తే.. పవన్‌ కల్యాణ్‌ బీజేపీకి మద్దతిచ్చాడన్న మాజీ మంత్రి.. ఆంధ్రాలో పవన్‌, చంద్రబాబు కలిసి పోటీచేస్తున్నారని మండిపడ్డారు.


ఇదే సమయంలో సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనపై టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని బాలినేని ఖండించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏమైనా సైకిల్ మీద పరామర్శకు వెళ్లాడా అంటూ సెటైర్లు వేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా 2024లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు శనివారం కూడా బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు ముందే తెలుసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. దీనిపై 50 లక్షలు పందెం కూడా వేశానని చెప్పారు. అయితే తన కుమారుడికి బీఆర్ఎస్ గెలవాలని తపన అని చెప్పిన మాజీ మంత్రి.. కొడుకు బాధపడటం చూడకూడదనే పందెం రద్దుచేసుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com