ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో చైనా న్యుమోనియా తరహా కేసులు!.. కేంద్రం కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 09:55 PM

చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యం, ఆస్పత్రుల సన్నద్ధతపై పలు కీలక సూచనలు చేసింది. అయితే ఈ సమయంలోనే.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చైనా న్యుమోనియా తరహా కేసులు బయటపడ్డాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాగా దెబ్బతిన్న ప్రజానీకం.. న్యుమోనియా కేసులు ఇండియాలోనూ నమోదయ్యాయన్న వార్తలతో కంగారు పడిపోయారు. అయితే ఈ వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో నమోదైన కేసులు చైనాలో వెలుగుచూసిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో ముడిపడి ఉన్నాయనే వార్తా కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడుకేసులకు చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఢిల్లీ ఎయిమ్స్‌లో నమోదైన ఏడు కేసులతో ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.


2023 జనవరి నుంచి ఇప్పటి వరకూ జరిపిన పరీక్షల్లో ఎలాంటి మైకోప్లాస్మా న్యుమోనియా కేసులు వెలుగుచూడలేదని పేర్కొంది. ఎయిమ్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ‌లో ఇప్పటి వరకూ 611 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. మన దేశంలో ఇప్పటి వరకూ మైకోప్లాస్మా న్యుమోనియా కేసులు బయటపడలేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ఈ న్యుమోనియా గురించి ఎప్పటి కప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు వివరించింది. మరోవైపు న్యుమోనియా తరహా లక్షణాలతో చైనాలో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. అయితే శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలు అని చైనా చెబుతూ వస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ సైతం ఈ కేసులపై నివేదిక కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సైతం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. చైనాలోని పరిస్థితులను పరిశీలిస్తున్నామన్న కేంద్రం.. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిపిన సమీక్షలో సూచించింది. ఆస్పత్రులలో బెడ్లు, మందులు, పీపీఈ కిట్లు, టెస్టు కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com