ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి జగన్, చంద్రబాబుకు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 07:11 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముందుగా ఉదయం 10.28 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించగా.. ఆ తర్వాత ఓత్ టైమ్‌ను మధ్యాహ్నం 1.04 గంటలకు మార్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు గాంధీ కుటుంబ సభ్యులు, కేసీ వేణుగోపాల్ తదితర ఏఐసీసీ ప్రముఖులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎం, ఆ పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సైతం ఆహ్వానం పంపించారు. అయితే జగన్, చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.


ఇప్పటి వరకూ సీఎంగా ఉన్న కేసీఆర్‌, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ఎక్కడా ప్రకటించనప్పటికీ.. తెలంగాణలోని జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కేసీఆర్‌కే ఓటేశారు. అదీగాక కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో విబేధించి ఆయన పార్టీని పెట్టారు. కాంగ్రెస్ పెద్దలే తనను జైల్లో పెట్టారనే కోపం జగన్‌లో ఉంది. అంతే కాకుండా రేవంత్ గతంలో చంద్రబాబు పార్టీలో పని చేశారు. దీంతో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు జగన్ హాజరయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనేది నెటిజన్ల మాట. ఒకవేళ ఆయన హాజరు కావాలని అనుకుంటే మాత్రం అది ఆహ్వానించదగ్గ పరిణామమే కాకుండా.. ఆశ్చర్యకరమైన పరిణామం కూడా.


ఇక చంద్రబాబు నాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం డౌటే. రేవంత్ గతంలో టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోగా.. బెయిల్ మీద జైలు నుంచి బయటకొచ్చిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఈ ఎన్నికల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తెలంగాణలోని టీడీపీ కేడర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసింది. ఎన్నికల ఫలితాలొచ్చాక గాంధీ భవన్‌లో టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడటం దీనికి నిదర్శనం. రేవంత్‌తో చంద్రబాబుకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నప్పటికీ.. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసినప్పటికీ.. రేవంతుడి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు దూరంగానే ఉండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


జగన్, చంద్రబాబు దూరంగా ఉండిపోతారని చెప్పడం వెనుక.. వారి స్వీయ ప్రయోజనాలు, ఆంధ్రా రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రయోజనాలే ప్రధాన కారణం. ఏపీలోని పరిస్థితుల దృష్ట్యా 2019 ఎన్నికల తర్వాతి నుంచి ఆ రాష్ట్రంలోని మూడు పార్టీలు ఇప్పటి దాకా కేంద్రంలో బీజేపీతో సఖ్యతకే ప్రయత్నించాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కమలం వికసించింది. రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఊహించిందే అయినప్పటికీ.. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఏకపక్ష విజయం, ఛత్తీస్‌గఢ్‌లో కమలం గెలవడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. ఇవన్నీ మోదీ హ్యాట్రిక్‌కు సంకేతాలు. మరో ఐదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తుండటంతో.. ఓ కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ఏమంత తెలివైన నిర్ణయం కాదు కదా..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com