ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంగ్రాట్స్ రేవంతన్నా.. అది నీ ఒక్కడితోనే సాధ్యం.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశంసలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 06:57 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ సర్కారు మీద రేవంత్ రెడ్డి సాగించిన రాజీలేని పోరాటమే తనను సీఎం పీఠం వరకూ తీసుకొచ్చిందని వెంకట్రామిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ధర్మవరం ఎమ్మెల్యే.. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే తమకు పరిచయమైందని అన్నారు. "కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయినా వెనకడుగు వేయకుండా కేసీఆర్ మీద రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసీఆర్‌తో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకుండా, రాజీలేని పోరాటం చేసిన కొద్దిమంది నేతలలో రేవంత్ రెడ్డి ఒకరు. కేసీఆర్ మీద రాజీలేని పోరాటం చేయడం వలనే అతనిపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగింది. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మేము కలిసేవాళ్లం. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో అసెంబ్లీలోని వాతావరణం కారణంగా మాట్లాడలేకపోతున్నామని నాతో చెప్పేవాడు" అంటూ కేతిరెడ్డి అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు.


రేవంత్ రెడ్డి మానసికంగా చాలా బలవంతుడన్న ధర్మవరం ఎమ్మెల్యే.. ఓటుకునోటు వంటి అభియోగాలు ఎదురైతే రాజకీయాలకు ముగింపు పడుతుందని అన్నారు. కానీ జైలుకు వెళ్లినప్పటికీ కుంగిపోకుండా పైకి ఎదిగిన వ్యక్తి రేవంత్ అని కేతిరెడ్డి కొనియాడారు. "ఓటుకు నోటు వంటి అభియోగాలు వస్తే రాజకీయాలకు ముగింపు పడుతుంది. కానీ జైలుకు వెళ్లినా కూడా భయపడని వ్యక్తి రేవంత్ రెడ్డి. మానసికంగా ఎంతో బలంగా ఉంటే అలాంటి పరిస్థితుల నుంచి బయటకురాలేం. కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో త్వరగా ఎదగటం కష్టం. కానీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నా, అందరినీ కలుపుకుని అందరిలో విశ్వాసం తీసుకువచ్చాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించి విజయం సాధించాడు" అని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు.


మరోవైపు చంద్రబాబు నుంచి విడిపోవటమే రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్‌‌కు టర్నింగ్ పాయింట్ అని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక అతి కొద్దికాలంలోనే పీసీసీ చీఫ్‌గా ఎదిగాడని.., ఇవాళ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నాడని అన్నారు. కేసీఆర్ కూడా చంద్రబాబు వద్ద నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టుకుని సీఎంగా ఎదిగారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు.రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నుంచి విడిపోయాకే సీఎం అవుతున్నారని అన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ విషయం ప్రస్తావించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. చంద్రబాబు కింద ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎదగలేడని అభిప్రాయపడ్డారు. 20 నుంచి 30 సీట్లు చాలనుకుని సంతృప్తి పడాలని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com