ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త వ్యక్తిగత సమాచారం భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు: హైకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 09:56 PM

వ్యక్తిగత గోప్యత హక్కు, స్వయంప్రతిపత్తి విషయంలో జీవిత భాగస్వామికి మినహాయింపు లేదని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భర్త వ్యక్తిగత వివరాలను భార్యకు తెలపాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా.. విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కులేదని జస్టిస్‌ ఎస్‌.సునీల్‌దత్‌ యాదవ్‌, జస్టిస్‌ విజయకుమార్‌ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హుబ్బళ్లికి చెందిన మహిళ తన మాజీ భర్త ఆధార్ సహా వ్యక్తిగత వివరాలను కోరుతూ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది.


హుబ్బళ్లికి చెందిన మహిళకు 2005లో వివాహం కాగా.. ఓ పాపు పుట్టిన తర్వాత భార్యాభర్తల మనస్పర్దల తలెత్తాయి. దీంతో దంపతులు విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా రూ.10,000.. వారి పాప సంరక్షణకు అదనంగా మరో రూ.5 వేలు చెల్లించాలని సదరు భర్తను కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. అయితే, తన మాజీ భర్త కోర్టు ఆదేశాలను ధిక్కరించారని, భరణాన్ని ఇవ్వడం లేదని ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆధార్‌ కార్డు వివరాలను ఇవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌)ను కోరారు.


ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. తాము వివరాలు ఇవ్వలేమని 2021 ఫిబ్రవరి 25న ఉడాయ్‌ తిరస్కరించింది. ఈనిర్ణయంపై ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ ధర్మాసనం.. ఆమెకు ఆధార్‌ వివరాలు అందజేయాలని గత ఫిబ్రవరి 8న ఆదేశించింది. అయితే, సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై ఉడాయ్‌ మళ్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్‌, ఇతర వ్యక్తిగత వివరాలను తెలియజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉడాయ్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.


ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉడాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతకు ముందు ఆ మహిళ.. వివాహం అనేది జీవిత భాగస్వామి వ్యక్తిగత సమాచార ప్రాప్యతను సమర్థిస్తుందని, గుర్తింపుల కలయికను సూచిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పరిశీలనల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ఏదైనా బహిర్గతం చేయడానికి ముందు వారి వ్యక్తిగత హక్కును పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. ‘ఇద్దరు భాగస్వాముల కలయిక అయిన వివాహం బంధం ఒక వ్యక్తి గోప్యతా హక్కును మరుగుపరచదు.. అటువంటి వ్యక్తిగత హక్కు స్వయంప్రతిపత్తిని సెక్షన్ 33 ప్రకారం గుర్తించి, రక్షించబడుతుంది. . ఆధార్ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం విధానపరమైన హక్కును వివాహం స్వయంగా తొలగించలేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com