రెండు సున్నాలు కలిస్తే వచ్చేది సున్నాయే అని టీీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేశారని, కానీ చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ బాధపడిపోతున్నాడని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజి గమనిస్తే అతడు అబద్ధాలు చెబుతున్నాడన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు. ఏ విధంగా చూసినా పవన్ కు నైతిక విలువలు లేవని, రాజకీయంగా, వ్యక్తిగతంగా విలువల్లేని వ్యక్తి అని విమర్శించారు. ఒకరితో పెళ్లి, మరొకరితో కాపురం.. ఇదీ పవన్ నైజం అని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తామని పవన్ అంటున్నాడని, రెండంకెలు కలిస్తే కొత్త అంకె ఏర్పడుతుందేమో కానీ, రెండు సున్నాలు కలిస్తే వచ్చేది సున్నాయేనని ఎద్దేవా చేశారు. నాదెండ్ల మనోహర్ కొంగు పట్టుకుని పవన్ సముద్రంలో ఈదుతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీలో జనసేన, టీడీపీ కలిసి వచ్చినా సరే వైసీపీ విజయాన్ని ఆపలేరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.