పోలవరం ప్రాజెక్టుకు త్వరలో కేంద్రం రూ.12 వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేయనున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సిహరావు వెల్లడించారు. రూ.12,911 కోట్ల నిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జమ అవుతాయని తెలిపారు. శుక్రవారం విజయవాడలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పోలవరంకు నిధులు విడుదల చేయడంపై త్వరలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుందని ప్రకటించారు. పోలవరం ఫస్ట్ ఫేజ్ పనులు, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుల కోసం కేంద్రం నిధులు ఇవ్వనుందని తెలిపారు. ఇటీవల కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధుల వివరాల గురించి జీవీఎల్ వివరించారు. ఇటీవల రెవెన్యూ లోటు కింద రూ.10 వేల కోట్లు, స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ కింద రూ.10 వేల కోట్ల నిధులను ఏపీకి కేంద్రం విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని, ప్రజలు గమనించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తొలి దశ నిధుల కింద రూ.17,144 కోట్లు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. గురువారం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి జలశక్తిశాఖకు పంపాలని కేంద్రమంత్రి సూచించారు. పోలవరం పూర్తి చేయడానికి 2025 వరకు గడువు ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే అందుకు కేంద్రమంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2025 జూన్ వరకు గడువు పెంచే అవకాశం లేదని, 2024 జూన్ లోపు పూర్తి చేయాలని గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఒక్క రోజు కూడా గడువు మీరొద్దని, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచించారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని, అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.
గురువారం పోలవరం ప్రాజెక్టు పనులపై ఢిల్లీలో కేంద్రంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగిన క్రమంలో.. ఇవాళ పోలవరం నిధులపై జీవీఎల్ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే పోలవరం నిర్మాణానికి నిధులు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది. నిధులు అందిస్తే పనులు పుంజుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.