ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైతీల నివాసాలపై దాడిచేసిన కుకీ మిలిటెంట్లు యత్నం

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:42 PM

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ మరోసారి రణరంగంగా మారింది. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో గిరిజనులు, గిరిజనేతర వర్గాల మధ్య వివాదం హింసకు దారితీసిన విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు అట్టుడికిన ఇంఫాల్‌ మరోసారి రగిలింది. అక్కడి లోయలో ఆదివారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్‌, సెరౌ ప్రాంతాల్లో మైతీలపై కుకీ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. సైన్యం కూంబింగ్‌ చేపట్టి.. ఆయుధాల ఏరివేత సాగిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారు. కాల్పులు రోజంతా కొనసాగగా.. వీధుల్లో పదుల సంఖ్యలో మృతదేహాలు పడి ఉన్నాయి.


మరోవైపు, మానవ కవచం సాయంతో మణిపూర్‌లో విధ్వంసానికి ప్లాన్ చేశారని సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను రెండు సమూహాల మధ్య జరిగిన కమ్యూనికేషన్‌ను గుర్తించినట్టు పేర్కొంది. ‘మీరు మా పర్యవేక్షణలో ఉన్నారు.. నీచమైన కుట్రతో సంబంధం లేకుండా శాంతిని పునరుద్ధరించి, ప్రజలకు అనుకూలమైన విధానాన్ని అవలంబించడానికి భారత సైన్యం కట్టుబడి ఉంది’ అని హెచ్చరిస్తూ మణిపూర్‌కు చెందిన స్పియర్ కార్ప్స్ ట్వీట్ చేసింది.


‘పార్టీ ఏ, ‘పార్టీ బీ’ మధ్య జరిగిన కమ్యూనికేషన్‌ను ఉటంకిస్తూ.. ఒక విధ్వంసక దాడులకు ప్రణాళిక రూపొందించినట్లు సైన్యం తెలిపింది. ‘మేము ముందువరుసలో ఉంటాం.. మొత్తం ప్రజానీకం మా వెనుక ఉంటుంది.. ఆ తర్వాత మేము ఒక గ్రామాన్ని నాశనం చేస్తాం’ అని రెండు గ్రూప్‌ల మధ్య జరిగిన సంభాషణ బట్టి తెలుస్తోంది.


పార్టీ బీ గ్రామం, లక్షిత ప్రాంతం స్థానాన్ని తెలుసుకోవాలని కోరినప్పుడు.. పార్టీ A సైన్యం విడుదల చేసిన ట్రాన్‌స్క్రిప్ట్‌లో అస్పష్టంగా ఉన్న వివరాలతో ప్రతిస్పందించింది. వాహనాన్ని ఏర్పాటు చేయాలని, ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ Bని పార్టీ ఏ కోరిందని సైన్యం తెలిపింది. తరువాత అప్‌డేట్ కోరిన పార్టీ ఏ.. ఆయుధాలు తీసుకురావడానికి నేను 15 మందిని తీసుకువస్తాను’అని చెప్పినట్లు తెలిసింది. దీనికి పార్టీ A బదులిస్తూ ‘మీరు చింతించొద్దు.. ఆయుధాలతో పోలిస్తే క్యాడర్‌ల సంఖ్య ఎక్కువ’ అని తెలిపింది.


మరోవైపు, ఘర్షణలకు పాల్పడిన వారిని సాయుధ ఉగ్రవాదులుగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అభివర్ణించారు. ‘ఒక్క రోజులోనే 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు నివేదికలు అందాయి. ఏకే 47, ఎం–16, స్నైపర్‌ తుపాకులతో ప్రజలపై దుండగులు దాడులకు దిగుతున్నారు.. ఊళ్లలోకి చొరబడి ఇళ్లకు నిప్పుపెడుతున్నారు’’ అని తెలిపారు. ఇది జాతుల మధ్య సంఘర్షణ కాదని, ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరుగుతున్న సమరం అని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com