ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్,,,పేర్ని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 07:33 PM

జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. మాజీమంత్రి పేర్ని నాని కొనియాడారు. భారతదేశంలో రాజకీయ పార్టీల నేతలకు సింహస్వప్నం ఎన్టీఆర్ అని కీర్తించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అని పొగడ్తల వర్షం కురిపించారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.


'పేదలకు పక్కా ఇల్లు పథకం ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్. మునసబుదారీ వ్యవస్థను రద్దు చేసి.. రైతులకు మేలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర. ఎన్టీఆర్‌కు ఈ రోజు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో చూస్తే బాధేస్తోంది. కుర్చీలోంచి కూలదోసి.. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండేయించుకునే దుస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గుల చేతుల మీదుగా వర్ధంతులు, జయంతులు జరిపించుకోవాల్సిన దుస్థితి పట్టింది. హత్య చేసిన చేతులతో దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు. ఏరుదాటాక తెప్పతగలెట్టే రకం చంద్రబాబు. అరచేతితో సూరీడుని అడ్డుకోలేరు. 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు ఖాయం' అని పేర్ని నాని స్పష్టం చేశారు.


ఈ వేడుకల్లో నందమూరి లక్ష్మీపార్వతి కూడా పాల్గొన్నారు. ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. 'విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాను. నా ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ శతాబ్ధం ఎన్టీఆర్‌దే. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు. ఈ మధ్య ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్‌కు మేమే వారసులమంటున్నారు' అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.


'మాట్లాడ్డం కూడా రాని లోకేష్ నేనే ఎన్టీఆర్ వారసుడిని అంటున్నాడు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఈ దుర్మార్గులు వారసులు ఎలా అవుతారు. చంద్రబాబు అంత నీచుడు మరొకరు లేరు. ఎన్టీఆర్ పేరు చెప్పడానికి.. బ్యానర్ పెట్టడానికి చంద్రబాబుకు అర్హత ఉందా.. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన గొప్ప మనసున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటా. నాకు జరిగిన అన్యాయాన్ని వాస్తవ రూపంలో సినిమా ద్వారా చూపించిన ఆర్జీవీకి రుణపడి ఉంటా. నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు.. నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు' అని లక్ష్మీపార్వతి వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com