అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతలకు ఉపాధి పనుల విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం దంతలపల్లిలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు బాల వెంకటరెడ్డి, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణపై ఇరువర్గాలు పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యల్లనూరు మండలంలో కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాలు కోసం గ్రామాల్లో కక్ష్యలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆటవిక రాజ్యం నడుస్తుందని... పుట్లూరు,యల్లనూరు మండలాలతో సంబంధాలు ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవడం లేదని విమర్శించారు.