ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దమ్ముంటే రండి...బీజేపీ నేతలకు నందిగం సురేష్ సవాల్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 10:00 PM

బీజేపీ నేతలకు  వైసీపీ ఎంపీ  నందిగం సురేష్ సవాల్ విసిరారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పిచ్చోడిలా మాట్లాడుతున్నారు.. సత్యకుమార్‌ అనుచరులు దళితులపై దాడి చేశారు.. ఆదినారాయ‌ణ‌ రెడ్డి నీకు ద‌మ్మూ, ధైర్యం ఉంటే.. మొరిగి వెళ్ల‌డం కాదు.. 4 గంట‌లు కాదు.. 10, 11 గంట‌లైనా ఇదే సెంట‌ర్‌లో ఉంటాం.. నువ్వో, నేనో తేల్చుకుందాం.. రా.. అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ బీజేపీ నేతలకు స‌వాల్ విసిరారు. మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారిపై దాడి చేశారని నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


'మూడు రాజధానులకు మద్దతుగా ఉద్దండరాయునిపాలెంలో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. 915 రోజులుగా దీక్ష చేస్తున్నారు. వారిపై దాడికి ప్రేరేపించిన చంద్రబాబును, దాడికి పాల్పడిన బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలి. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న దళిత మహిళలు, యువత, వృద్ధుల పై దాడికి పాల్పడిన వారి పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడి దాడులు చేశారు' అని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు.


'ఆదినారాయణ రెడ్డి  అనే వ్యక్తిని కార్లలో ఎక్కించుకొని దాచి మరీ తరలించారు. దీక్ష చేస్తున్న టెంటు దగ్గర జరిగిన గొడవలో ఆదినారాయణ రెడ్డి కూడా భాగస్వామి. అందరూ మౌనంగా ఉన్న సమయంలో టెంట్‌ దగ్గరకు వచ్చి తొడగొట్టి ఇష్టానుసారంగా దాడి చేశారు. మ‌హిళ‌ల‌పై దాడి చేయ‌డం దుర్మార్గ‌ం. మొదటి ముద్దాయిగా చంద్రబాబును, రెండో ముద్దాయిగా ఆదినారాయణ రెడ్డిని, మూడో ముద్దాయిగా సత్యకుమార్‌ ను చేర్చాలి. ప్రతిపక్షంలో ఉన్నా వారిలో ఇంకా దుర్మార్గమైన ఆలోచనలు పోలేదు' అని నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరోవైపు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది. మందడంలో జరిగిన దాడికి సంబంధించి.. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ రెడ్డి, ఆయన అనుచరులు, సత్యకుమార్, ఆయన అనుచరులు పైన కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కులం పేరుతో తిట్టి తమపై దాడి చేశారని.. బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఫిర్యాదులో ఆరోపించారు. అయితే.. ఎంపీ నందిగం సురేషే తమ పై దాడి చేయించారని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి, సత్యకుమార్ కూడా ఎంపీ సురేష్‌ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ.. అటు వైసీపీ నేతల వ్యాఖ్యలతో.. అమరావతి ప్రాంతం హాట్ హాట్‌ గా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com