చెరకు నరికే ఖర్చును గణనీయంగా తగ్గించే మినీ యంత్రం (హార్వెస్టర్) అందుబాటులోకి వచ్చిందని, మహారాష్ట్రలో చెరకు రైతులు ఇప్పటికే దీనిని విజయవంతంగా వినియోగిస్తున్నారని కొల్హాపూర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ బాబూరావు గైక్వాడ్, డాక్టర్ గోవింద్ తెలిపారు. వీరు మంగళవారం సాయంత్రం అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ను సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, రాజస్థాన్ రాజధాని జైపూర్లో తయారయ్యే ఈ యంత్రం ఖరీదు రూ.33 లక్షలని, గంటకు ఎకరా విస్తీర్ణంలోని చెరకును నరికివేస్తుందని చెప్పారు. చెరకును గడల రూపంలోనే నరికివేయడం దీని ప్రత్యేకతని, చెరకు వేళ్లు, మొవ్వు, ఎండుటాకులను రెలచి, గడలను ట్రాక్టర్లోకి లోడ్ చేస్తుందని తెలిపారు. చెరకు గడల్లో కిందిభాగాన సుక్రోజ్ శాతం అధికంగా వుంటుందని, యంత్రంతో నరకడం వల్ల దిగుబడి పెరిగి, కూలీల ఖర్చు తగ్గుతుందని వారు వివరించారు. మొత్తం మీద ఎకరాకు రూ.15-20 వేల వరకు ఆదా అవుతాయని చెప్పారు.