ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదాన్ని మట్టికరిపించాం...రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

national |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 07:52 PM

ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా మట్టికరిపించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ముర్ము ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా ఆవిర్భవిస్తోందని, ప్రపంచానికి పరిష్కారం చూపేలా మారిందని కితాబిచ్చారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం.. పెద్ద కలలను సాకారం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు.


దేశానికి అతిపెద్ద శత్రువైన అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశ ప్రజల అభివృద్ధి, రక్షణ కోసం కేంద్రం నిర్భయంగా వ్యవహరిస్తోందని, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. ‘‘75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలను పూర్తిచేసుకున్నాం. కొన్ని నెలల కిందటే ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు నిర్వహించుకున్నాం.. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం.. 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భర్‌ భారతంగా తీర్చిదిద్దాలి.


పేదరిక రహిత భారత నిర్మాణం కోసం కృషి జరుగుతోంది.. పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.. దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది.. తొమ్మిదేళ్ల పాలనలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగింది. విధానపరమైన లోపాన్ని వీడి దేశం ముందడుగు వేస్తోంది. వచ్చే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలి... అవినీతి అంతం దిశగా అడుగులేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోంది. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నాం. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచాం. బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నాం.


ప్రపంచమంతా భారత్‌వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోంది. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నాం. మాది ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం.. ప్రభుత్వం నిర్భయంగా పనిచేస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా సరిహద్దులను దాటి ఉగ్రవాదులను మట్టుబెట్టాం. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, ట్రిపుల్ తలాక్‌ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నాం.


డిజిటల్‌ ఇండియా దిశగా ముందుకు వడివడిగా సాగుతూ నూతన సాంకేతిక ఆధారంగా పౌరులకు సేవలందిస్తున్నాం... సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు చేపడుతున్నాం... భారత డిజిటల్ నెట్‌వర్క్‌ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారింది... ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మెరుగైన పథకాలు.. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు.. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. మూడు కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించాం. నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది’’ అని ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు.


మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం.. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకుంటున్నాం. సైన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించాం.. మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేపట్టిన బేటీ బచావో - బేటీ పడావో విజయవంతమైంది.. చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం. ఫసల్‌ బీమా యోజన, కిసాన్‌ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చాం. పంటలకు కనీస మద్దతు ధరను పెంచి రైతులను బలోపేతం చేస్తున్నాం అని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com