నేపాల్ తరహా పరిస్థితులు క్రమంలో పాకిస్తాన్ లో కూడా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే దేశంలో నెలకున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు దాయాది పాకిస్థాన్ కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే మంత్రుల విదేశీ ప్రయాణాలు, లగ్జరీ కార్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఆహార కొరత, విద్యుత్ సంక్షోభం, కొండెక్కిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజల నెత్తిన మరో భారం వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచింది. లీటర్కు ఏకంగా రూ.35 చొప్పున వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఆదివారమే అమల్లోకి వచ్చినట్లు పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్తోపాటు కిరోసిన్, లైట్ డీజిల్ ధరలను కూడా లీటర్కు రూ.18 చొప్పున వడ్డించింది.
ఈ నిర్ణయంతో పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.249.80కి చేరగా.. హైస్పీడ్ డీజిల్ రూ.262.80కు చేరింది. కిరోసిన్ రూ.189.83, లైట్ డీజిల్ రూ.187కు పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై రూ.50 పెంచుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుండగానే రూ.35 పెరిగింది. ధరల పెంపుతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్దఎత్తున బారులు తీరారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును పాక్ ఆర్ధిక మంత్రి సమర్దించుకున్నారు. ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్దేశించడంతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, లైట్ డీజిల్ ధరలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. నాలుగు నెలలుగా వీటి ధరలు పెరగలేదని, నిలకడగా ఉన్నాయన్నారు. అంతేకాదు, నిజానికి డీజిల్, కిరోసిన్ ధరలు తగ్గాయని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సాయమే దిక్కు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల అంగీకరించారు. ఐఎంఎఫ్ నిధుల కోసం ఎంత కఠినమైన ఆంక్షలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఐఎంఎఫ్ నిధులు విడుదల చేయకపోతే.. 2019లో మంజూరైన 6 బిలియన్ డాలర్లు రద్దయిపోతాయి. అందుకే పాక్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు స్పష్టం అవుతోంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణాలు పొందేందుకు రూపాయి మారకపు రేటుపై నిబంధనను సరళతరం చేసింది. దీని కారణంగా డాలరుతో పాక్ రూపాయి మారకపు విలువ ఊహించని రీతిలో పతనమయి 255కి పడిపోయింది. ఇంత పెద్దమొత్తంలో పాక్ రూపాయి పతనం కావడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. రూపాయిపై నియంత్రణలను సరళీకరించాలని, మారకపు విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలని పాకిస్థాన్కు ఐఎంఎఫ్ పలు షరతులు విధించింది. దీంతో గత్యంతరం లేక దాయాది తలొగ్గింది.