ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరగాళ్లు ఇలా కూడా కాజేస్తున్నారు.... ఆ మెసేజ్ నొక్కిన పాపానికి అలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:45 PM

సాంకేతికత ఎంత అందుబాటులోకి వస్తోందో సైబర్ నేరాలు కూడా అంతేవేగంగా పెరిగిపోతున్నాయ్. ఇదిలావుంటే సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త దారిలో అమాయకులకు వల వేసి ఉన్నకాడికి ఊడ్చేస్తున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. హరియాణా, గురుగ్రామ్‌ నగరంలోని డీఎల్ఎఫ్ ఫేస్-5 ప్రాంతానికి చెందిన ఓ మహిళను మోసగించి రూ.1 లక్ష మాయం చేశారు కేటుగాళ్లు. ఆమె చేసిన తప్పల్లా తన ఫోనుకు వచ్చిన మెసేజ్‌ను చదవడమే. అంతే ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం మాయమై పోయాయి. లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కొంత మంది అమాయకులు కేటుగాళ్ల బారినపడి మోసపోతున్నారు.


డీఎల్ఎఫ్ ఫేస్ 5 కి చెందిన మాధవి దత్త అనే మహిళ ఫోన్‌కు జనవరి 21న మెసేజ్ వచ్చింది. డియర్ యూజర్ మీ హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఈరోజు క్లోజ్ అవుతోంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి అని ఉంది. అది చూసిన దత్త తన బ్యాంకు ఖాతా నిజంగానే క్లోజ్ అవుతోందని ఆందోళన చెంది ఆ లింక్‌పై క్లిక్ చేసింది. ఆ తర్వాత ఓ వెబ్ పేజీ ఓపెన్ అయింది. అందులో వివరాలు నమోదు చేయడంతో మొబైల్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది. ఓటీపీని ఎంటర్ చేయగానే ఖాతాలో ఉన్న రూ.1 లక్ష విత్ డ్రా చేసినట్లు మరో మెసేజ్ రావడంతో అవాక్కవడం బాధితురాలి వంతైంది.


రూ.1 లక్ష ఖాతా నుంచి మాయం కావడంతో ఆందోళన చెందిన బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు పలుమార్లు ఫోన్ చేసింది. అయితే స్పందన లేకపోవడంతో ఆ తర్వాత సైబర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోలీసుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మోరకు సెక్షన్ 419, 420 కింద సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇలాంటి అమయాకులు చాలా మంది రోజూ సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా అందే లింకులను ఓపెన్ చేసే టప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ లింకుల ద్వారా సులభంగా మోసగిస్తూ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను మొత్తం ఊడ్చేస్తారని పేర్కొన్నారు. అత్యవసరం అనే ఆలోచన కల్పించే ప్రయత్నం చేసి సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎల్లప్పుడూ బ్యాంకు ఖాతా నంబర్, ఏటీఎం పిన్, ఓటీపీ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com