పంటలు పండించే రైతన్నలకు మంచి ఆలోచన వచ్చింది...అది ఆచరణలో పెడితే అద్భుతమే జరిగింది. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి వద్ద పొలాలకు విద్యుత్తు సౌకర్యం కోసం.. కిలోమీటరు మేర తాటి దుంగలతో విద్యుత్తు లైన్ను రైతులే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. జొన్నతాళి సమీపంలో రెండు పరిశ్రమలు ఉన్నాయి. దీంతో అధికారులు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా చెబుతూ వస్తున్నారు. కానీ.. మార్టూరు వరకు మూడు కిలోమీటర్ల మేర పొలాలు కలిగిన రైతులకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో పదేళ్లుగా రైతులు కర్రలతో విద్యుత్తు తీగలు పొలాల వరకు తీసుకెళ్లేవారు.
ప్రతి ఏడాది కర్రలను మార్చాల్సి రావడంతో.. ప్రత్యామ్నాయంగా ఇలా కిలోమీటరు మేర తాటి దుంగలను పాతి.. తీగలను తమ పొలాల వరకు తీసుకువెళ్లారు. పొలాలకు నీరు పారిస్తున్నారు. గతంలో చాలాసార్లు అధికారులకు సమస్యను విన్నవించినా.. విద్యుత్ లైన్ ) వేయలేదని.. అందుకే తామే ఇలా తాటి దుంగలను నాటామని అన్నదాతలు చెబుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని.. అంటున్నారు. ప్రతీ దానికి అధికారులపై ఆధారపడితే.. సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేస్తున్నారు.