ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా...పెద్దల ఆశీర్వాదంతో నారా లోకేష్ యాత్రకు సన్నద్దం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 09:34 PM

భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా...పెద్దల ఆశీర్వాదం తీసుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని తన నివాసంలో లోకేష్ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. లోకేష్‌ను తల్లిదండ్రులు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర ఆశీర్వదించారు. భార్య బ్రాహ్మణి లోకేష్‌కు వీర తిలకం దిద్ది.. హారతి ఇచ్చారు. ఇతర కుటుంబ సభ్యులు లోకేష్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


ఈ నేపథ్యంలో లోకేష్ బుధవారం భావోద్వేగ ట్వీట్ చేశారు. తన జీవితం ఎంతో ఉద్విగ్నమైన క్షణాలను అనుభవించానని పేర్కొన్నారు. అమ్మానాన్నలు మౌనంగా కౌగిలించుకున్నప్పుడు ఆ మనసుల తడి తెలిసిందన్నారు.


‘‘ఈరోజు నా జీవితంలో ఎంతో ఉద్విగ్నమైన క్షణాలను అనుభవించాను. జనం కోసం 400 రోజుల పాదయాత్రకు బయలుదేరే ముందు కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెబుతుంటే మాటలకందని భావోద్వేగాలు మనసును ముంచెత్తాయి. దేవాన్ష్ కు ముద్దులు పెట్టి అమ్మానాన్నలకు పాదాభివందనం చేశాను.


అమ్మానాన్నలు మౌనంగా కౌగలించుకున్నప్పుడు ఆ మనసుల తడి తెలిసింది. బాలా మావయ్య, అత్తయ్యలతో పాటు ఇతర కుటుంబసభ్యులు, బంధువుల ఆశీర్వాదాలు తీసుకున్నాను. బ్రాహ్మణి చేతుల మీదుగా విజయహారతి అందుకుని ర్యాలీగా ఎన్టీఆర్ ఘాట్ కు బయలుదేరాను. తాతకు పుష్పాంజలి ఘటించి ఆశీర్వాదాలు అందుకున్నాను.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com