ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:17 AM

మాండస్ తుఫాను దేశంలోని పలు రాష్ట్రాలను వణికిస్తోంది.. తాజాగా మూడు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను కారణంగా తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. ఈ తుఫాను ప్రస్తుతం గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తరంగా 350 కిలోమీటర్లు, జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరం, మహాబలిపురానికి 130 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న మాండూస్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.


తుఫాను తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని,. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


శుక్రవారం మధ్యాహ్నానికి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారిన మాండూస్.. శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కావేరి డెల్టా ప్రాంతంలోని నాగపట్నం, తంజావూరు, చెన్నై, దాని పొరుగున ఉన్న మూడు జిల్లాలు, కడలూరుతో సహా 10 జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, స్టేట్ ఫోర్స్ నుంచి దాదాపు 400 మంది సిబ్బందితో కూడిన 12 బృందాలను మోహరించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.


శుక్రవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మొత్తం 24 జిల్లాలో స్కూల్స్ ,కాలేజీలను మూసివేశారు. చెన్నై నుంచి వెళ్లాల్సిన 15 మాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో మాండూస్ ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడు లోతట్టు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కడలూరుకు సమీపంలో సముద్రంలో చిక్కుకున్న ముగ్గురిని కోస్ట్‌గార్డ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌ (ఏఎల్‌హెచ్‌) ద్వారా రక్షించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com