ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వెబ్ సీరిస్ తో వివాదంలోకి ఐపీఎస్ అధికారి అమిత్ లోధా

national |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:14 AM

వెబ్ సీరిస్ నిర్మాణంతో బీహార్ కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి వివాదంలో చిక్కుకొన్నారు. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో సంచలనంగా మారిన బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపలతో కేసు నమోదయ్యింది. అమిత్ లోధా తన ఉద్యోగ జీవితంలో జరిగిన ఓ కీలకఘట్టాన్ని ప్రస్తావిస్తూ ఆయన స్వయంగా రాసిన ‘బిహార్‌ డైరీస్‌’ పుస్తకాధారంగా ‘ఖాకీ.. ది బిహార్ చాప్టర్’ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. అయితే, తన పుస్తకాన్ని మార్కెటింగ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో అమిత్‌ రూ.1కి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, వాస్తవంగా ఆయనకు భారీ మొత్తం లభించినట్టు పోలీసులు తెలిపారు.


ఆయన భార్య బ్యాంకు ఖాతాకు రూ. 49లక్షలు బదిలీ అయినట్టు గుర్తించామని, ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం కింద లోధాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సిరీస్‌ ఒప్పందానికి ముందే ఈ నగదు జమైందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. మగధ్‌ రేంజ్‌ ఐజీగా ఉన్న సమయంలో ఇది జరిగిందని పేర్కొన్నారు. గయలో పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచి లోధా అక్రమంగా సంపాదిస్తున్నారని, అతని పుస్తకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతి ఉండదని బిహార్ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన దర్యాప్తునకు ఓ డీఎస్పీని నియమించారు. అయితే, లోధాపై అవినీతి ఆరోపణలకు అప్పటి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య కుమార్‌తో అతనికి ఉన్న వివాదమే కారణమని అంటున్నారు.


బిహార్‌లోని షైఖ్‌పుర ప్రాంతంలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా మారి.. ఒకే రోజు 24 హత్యలకు కారణమైన ఓ వ్యక్తిని పోలీసు అధికారి ఎలా పట్టుకున్నారనే కథాంశంతో ‘ఖాకీ’ వెబ్ సిరీస్‌ రూపొందింది. దీనికి లోధా రాసిన పుస్తకం బిహార్ డెయిరీస్ ఆధారం. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.


98 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అమిత్ లోధా.. 2006లో షైఖ్‌పూర్‌ ఎస్పీగా పనిచేసినప్పుడు వార్తల్లో నిలిచారు. ఆ ప్రాంతంలో పోలీసులకు కొరకరానికొయ్యలా ఉన్న కరుడగట్టిన క్రిమినల్స్ అశోక్ మెహతా, అతడి అనుచరుడు పింటూ మెహతాల అరెస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. వీరిని ఎలా పట్టుకున్నారో తెలియజేస్తూ బిహార్ డెయిరీస్ పేరుతో 2017లో రాసిన పుస్తకంలో లోధా వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com