ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జల వివాదానికి పుల్ స్టాఫ్ .....రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య

national |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:22 AM

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి చెక్ పడింది. తాజాాగా కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూల్‌ కర్వ్స్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్న ఆయన.. మరింత స్పష్టత కోసం కేంద్ర జలసంఘం అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.


హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్ఎంసీ) కన్వీనర్‌ ఆర్కే పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేఆర్‌ఎంబీ సభ్యుడు మౌంతాగ్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌, జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరాజాం, ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.


కేంద్ర జలసంఘం సూచనల ప్రకారం నాగార్జున సాగర్‌ రూల్‌ కర్వ్స్‌పై నిర్ణయం తీసుకుంటామని రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు. జల విద్యుత్‌ చెరిసగం వినియోగానికి ఇరు రాష్ట్రాలు ఆమోదించాయని చెప్పారు. మిగులు జలాల విషయంలో సమావేశంలో స్పష్టత వచ్చిందన్న పిళ్లై.. ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఓవర్‌ఫ్లో అయ్యాకే వరదను మిగులు జలాల కింద పరిగణించాలని ఇరు రాష్ట్రాలు సూచించాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణా నది ప్రవేశించాక.. సరిహద్దు నుంచి ప్రతి నీటి చుక్కా లెక్కించాలన్న నిర్ణయానికి రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్లు రవికుమార్‌ పిళ్లై పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అంగీకారంతో నివేదికను ఖరారు చేస్తామన్న ఆయన.. అనంతరం శాశ్వత ప్రాతిపదికన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసే అవకాశముందన్నారు.


ఇక, శ్రీశైలం జలాశయం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తెలిపారు. శ్రీశైలం రూల్‌కర్వ్స్‌, నీటిమట్టం, విద్యుదుత్పత్తిపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అయితే, నాగార్జున సాగర్ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని.. దీనిపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సముద్రంలో వృథాగా కలిసే నీటిని లెక్కించాలే తప్ప.. ఆ నీటిని రాష్ట్రాల వాటాలో కలపకూడదని కమిటీ నిర్ణయించిందని తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com