జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇప్పటిదాకా తాను రాజకీయాల్లో విఫలమైన నాయకుడి కిందే లెక్క అని వెల్లడించారు. ఓడిపోయానని చెప్పేందుకు ఎంతమాత్రం మొహమాటపడబోనని స్పష్టం చేశారు. తన పరాజయాల గురించి ధైర్యంగా మాట్లాడగలనని అన్నారు. పరాజయంలోనే జయం ఉందన్న విషయం మర్చిపోరాదని తెలిపారు. గెలుపును సగం పునాది వేసేది ఓటమేనని అభిప్రాయపడ్డారు.
'పేరు, డబ్బు ఉన్నవారంతా మహానుభావులు అనుకోవద్దు.. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏది ఒప్పు, ఏది తప్పు అని నిర్ణయించుకోవాలని, వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి అని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ 'ఫేసింగ్ ద ఫ్యూచర్' అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.