ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నది పెద్దలు చెప్పింది ఇందుకేనేమో అనేలా ఓ ఘటన చోటుచేసుకొంది. విజయదశమి సందర్భంగా దశకంఠ రావణుడి బొమ్మలను దగ్ధం చేయడం సంప్రదాయంగా వస్తోంది. రావణ దహనం పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇదిలావుంటే చత్తీస్ గఢ్ లోని ధంతరిలోనూ దసరా సందర్భంగా రావణ దహనం నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలో రావణుడి పది తలలు పూర్తిగా దగ్ధం కాలేదు. ఈ ఘటనను ధంతరి మున్సిపాలిటీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనికంతటికీ కారణం ఓ క్లర్క్ అని గుర్తించి, అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. అతడి అలసత్వం కారణంగానే రావణుడి పది తలలు దహనం కాలేదని నిర్ధారించారు. రావణుడి బొమ్మ తయారీ ఖర్చు బిల్లులను కూడా నిలిపి వేశారు. అంతేకాదు, రావణుడి తలలు ఎందుకు కాలిపోలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని మరో నలుగురు అధికారులకు నోటీసులు జారీ చేశారు.