ల్యాప్ టాప్ రంగంలో ఎంట్రీ ఇస్తున్న జీయో ప్రత్యర్తులకు సవాల్ విసరనున్నదా...? తక్కువ ధరకే ఆధునాతన ల్యాప్ ట్యాప్ అందుబాటులోకి తేనున్నదా అంటే అవుననే అంటున్నాయి టెక్ వర్గాలు. దేశవ్యాప్తంగా 4జీ ఇంటర్నెట్ తో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తక్కువ ధర ల్యాప్ టాప్ ‘జియోబుక్’తో మరోసారి కలకలం రేపేందుకు సిద్ధమవుతోంది. జియో సంస్థ నుంచి తక్కువ ధరకే ల్యాప్ టాప్ లను విడుదల చేస్తామని ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం రూ.15 వేల (184 డాలర్లు) ధరకే ల్యాప్ టాప్ ను విడుదల చేయనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ల్యాప్ టాప్ లో 4జీ సిమ్ కార్డును ఇన్ బిల్ట్ గా ఇవ్వనున్నారని, దానితో ఎక్కడైనా నేరుగా ఇంటర్నెట్ వాడుకునేందుకు వీలుగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ల్యాప్ టాప్ ధర, ప్రత్యేకతలపై స్పందించేందుకు జియో వర్గాలు నిరాకరించాయి.
జియో ల్యాప్ టాప్ ల కోసం రిలయన్స్ సంస్థ ఇప్పటికే మైక్రో ప్రాసెసర్ ల తయారీ సంస్థ క్వాల్ కమ్, ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అవసరానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన ‘జియో ఆపరేటింగ్ సిస్టం’తోపాటు జియోకు సంబంధించిన కొన్ని యాప్స్ ను, ఇతర సదుపాయాలను జియో ల్యాప్ టాప్ లో ముందే ఇన్ స్టాల్ చేసి అందించనున్నారు. అదనంగా అవసరమైన యాప్స్ ను జియో స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. తీవ్రమైన పోటీ ఉన్న ల్యాప్ టాప్ ల మార్కెట్లో జియో ల్యాప్ టాప్ సంచలనం సృష్టిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జియోకు 42 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారని.. ల్యాప్ టాప్ ల రాకతో జియో మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని పేర్కొంటున్నాయి. జియో ఈ నెలలోనే జియోబుక్ ల్యాప్ టాప్ లను విడుదల చేసే అవకాశం ఉందని.. మొదట స్కూళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు అందజేయనున్నారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో బహిరంగ మార్కెట్లోకి రావొచ్చని అంచనా వేస్తున్నాయి.