ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో తగ్గుతున్నాయి...చైనాలో పెరిగిపోతున్నాయి: అపూర్వ చంద్ర

national |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 11:15 PM

ఐదారు సంవత్సరాల క్రితం దేశంలో 12 వేల సినిమా థియేటర్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 8 వేలకు పడిపోయిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. అదే సమయంలో చైనాలో సినిమా హాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని, ఐదారేళ్ల కిందట చైనాలో 10 వేల థియేటర్లు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పెరిగిందని అన్నారు. ముంబయిలో ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ లో సినిమా థియేటర్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని అన్నారు.


ఈ కారణంగానే భారతీయ చిత్రాలు దేశంలో కంటే చైనాలో అధికంగా ప్రదర్శితమవుతున్నాయని అపూర్వ చంద్ర వెల్లడించారు. మన సినిమాలకు ఇక్కడి కంటే చైనాలో అధిక బిజినెస్ లభిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే, దేశంలో మరిన్ని థియేటర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం కొత్తగా ఫిలిం ఫెసిలిటేషన్ ఆఫీస్ (ఎఫ్ఎఫ్ఓ) ఏర్పాటైందని, సినిమా థియేటర్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులను ఈ కార్యాలయం వేగంగా మంజూరు చేస్తుందని అపూర్వ చంద్ర తెలిపారు. ప్రజలకు సినిమా ప్రధాన వినోదం అని, టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com