శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు టీటీడీ ఘన స్వాగతం పలికింది. ఏపీ సీఎం జగన్ తిరుపతి పర్యటన ముగించుకుని తిరుమల చేరుకున్నారు. ఆయనకు టీటీడీ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. తొలుత బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్ ఆపై వెంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ దుస్తులు, పట్టు తలపాగా (పరికట్టం) ధరించిన సీఎం జగన్ తలపై పట్టువస్త్రాలు మోస్తూ స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించారు. లాంఛనంగా పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం సీఎంకు ఆలయ వర్గాలు జ్ఞాపికలు, చిత్రపటాలను బహూకరించాయి. ఈ సందర్భంగా, టీటీడీ కాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఆలయ వర్గాలు అందించిన తీర్థప్రసాదాలను ముఖ్యమంత్రి సేవించారు. స్వామివారి సన్నిధిలో సీఎం జగన్ తో తులాభారం నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడే వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.