ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ అధ్యక్ష పీఠం అధిరోహించేదెద్వరూ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 10:35 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం అధిరోహించేదెవ్వరూ అన్న ఆసక్తికర చర్చ ఆ పార్టీలోనే కొనసాగుతోంది. ఈ పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లాట్,  శశిథరూర్ కు కూడా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. అశోక్ గెహ్లాట్ కు జోడుపదవుల అంశం, శశిథరూర్ కు సొంత పార్టీ నేతల నుంచి సెగ ఎదురవుతోంది. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరికి వరిస్తుందన్న చర్చ ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని కావాలని కలలు కంటున్న తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు సొంత రాష్ట్రం నుంచే ఎదురుగాలి వీస్తోంది. ఆయన అంతర్జాతీయస్థాయి వ్యక్తి అని, అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడమే మంచిదని సొంతం రాష్ట్రం నేతలు హితవు చెబుతున్నారు. నిజానికి రాహుల్ గాంధీకే తిరిగి పట్టం కట్టాలంటూ చాలా రాష్ట్రాలు తీర్మానాలు కూడా చేశాయి. అయితే, అవి చెల్లబోవంటూ సీనియర్ నేత జైరాం రమేశ్ వంటివారు చెబుతున్నా పీసీసీలు మాత్రం తీర్మానం చేస్తూనే ఉన్నాయి.  


తాజాగా, లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. శశిథరూర్ అంతర్జాతీయ వ్యక్తి అని, ఆయన పోటీ చేయకపోవడమే బెటరని అన్నారు. ఏకాభిప్రాయం కలిగిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని, రాహులే అధ్యక్షుడు కావాలని తాము ఇంకా కోరుకుంటున్నట్టు చెప్పారు. మరో ఎంపీ బెన్నీ బెహనాన్ మాట్లాడుతూ.. శశిథరూర్ హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరిస్తారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని తాను భావించడం లేదన్నారు. ‘ఏకాభిప్రాయం’ కలిగిన వ్యక్తిని అధ్యక్ష స్థానంపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసిన థరూర్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆకాంక్షను ఆమె వద్ద బయటపెట్టారు. స్పందించిన సోనియా ‘మీ ఇష్టం’ అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ ముందు నాలుగు ఆప్షన్లు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందులో మొదటిది రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం. రెండోది, ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుండా ఉండడం. అప్పుడు విషయం సీడబ్ల్యూసీ వద్దకు వెళ్తుంది. మూడోది, పోటీ లేకుండా ఏకాభిప్రాయం ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం. చివరగా ఎన్నిక నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం. శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి వారిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవడమే నాలుగో ఆప్షన్ అని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com