ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకోసం హింస, యుద్ధం అనుసరణీయం కాదు: జో బైడెన్

international |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 10:32 PM

దేశాలను ఆక్రమించుకోవడానికి, సరిహద్దులను విస్తరించుకోవడానికి హింస, యుద్ధం అనుసరణీయం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. పాశ్చాత్యదేశాలకు మరోసారి అణు హెచ్చరికలు జారీ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై జో బైడెన్ మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో బైడెన్ మాట్లాడుతూ, అణుయుద్ధాన్ని ఎప్పటికీ గెలవలేమని, అణుయుద్ధం జోలికి ఎన్నిటికీ వెళ్లరాదని అన్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా ఐరాస నియమావళిని తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఐరాస శాంతి సిద్ధాంతాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించిందని విమర్శించారు. పర్యవసానాలను పట్టించుకోకుండా సామ్రాజ్యవాద లక్ష్యాలతో ముందుకు వెళ్లే దేశాలు ఐక్యరాజ్యసమితి స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని వివరించారు. ప్రపంచశాంతికి ఐరాస నియమావళి ఒక ఆశాదీపం వంటిదని భావిస్తున్నామని తెలిపారు. జీ7 దేశాలతోనూ, తమలాగే ఆలోచించే ఇతర దేశాలతోనూ చేయి కలిపి ప్రజాస్వామ్యం ఏం చేయగలదో చూపిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వీటో వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తాము ఉక్రెయిన్ కు సంఘీభావంగా నిలుస్తామని బైడెన్ పునరుద్ఘాటించారు. అంతకుముందు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ టీవీ ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్యదేశాలు గీత దాటుతున్నాయని, రష్యాను నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ ప్రజలను యుద్ధ సరంజామాగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. రష్యా సమగ్రతకు, భద్రతకు ముప్పు అనిపిస్తే అణుదాడితో సహా అందుబాటులో ఉన్న అన్ని భద్రతా వ్యవస్థలను ఉపయోగిస్తామని పాశ్చాత్యదేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com