హైదరాబాద్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలే లక్ష్యంగా హైడ్రా బుల్డోజర్లు దండయాత్ర చేయగా.. అందులో చాలా మంది సామాన్యులకు సంబంధించిన నివాసాలు, జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లు కూల్చేశారు. కాగా.. ఇప్పుడు మూసీ ప్రక్షాళన కోసం పరివాహక ప్రాంతాల్లోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేతలపై బీఆర్ఎస్ తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. బాధితులకు అండగా నిలిచేందుకు.. గులాబీ నేతలంతా రోడ్డెక్కారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సహా.. నేతలంతా బాధితులను కలుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 01న) రోజున కూడా కేటీఆర్.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. బాధితులకు ధైర్యం చెప్పటమే కాకుండా.. ట్విట్టర్ వేదికగా కూడా ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నాయి. ఈ క్రమంలోనే.. చిన్నారుల ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు కేటీఆర్.
"వారి గూడుని కూల్చేశారు! వారి కలలను చిదిమేశారు! ఆ కూలిన ఇంటి శిథిలాల్లో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు! మీ మంత్రులను వచ్చి చెప్పమనండి.. వీళ్లు కూడా డబ్బులు తీసుకున్నారని! మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి.. మీ ఇళ్లు కూల్చి, మాల్స్ కడుతున్నాము.. మీ బ్రతుకులు బాగుపడతాయని. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!!! డియర్ రాహుల్ గాంధీ.. దయచేసి తెలంగాణలో మీ కూల్చివేత సర్కార్ని ఒకసారి చూడండి." అంటూ ఇద్దరు చిన్నారులు కూల్చేసిన తమ ఇంటి శిథిలాల్లో ఆడుకుంటున్న వీడియోను కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఎమోషనల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పేద పిల్లల పట్ల ప్రభుత్వానికి కనీసం కనికరం లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఎంతటి రాతి గుండె అయినా ఇలాంటివి చూసినప్పుడు మనసు కరిగిపోయి కళ్లల్లో నీళ్లు తిరుగుతయ్. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దల మనసు మాత్రం మారడం లేదు." అంటూ మరో నెటిజన్ కామెంట్ ఇచ్చారు. "ఏం రాజకీయమో ఏమో.. ప్రజల జీవితం అస్తవ్యస్తం చేస్తున్నారు." అని ఇంకో నెటిజన్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కామని కేటీఆర్ ఆరోపించారు. నమామి గంగే 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు పేరుతో కేంద్ర సర్కారు 40 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేసిన కేటీఆర్.. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు మాత్రం లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తుండటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa