తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో డిజిటల్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వ సిద్దమైంది. అత్యంత పకడ్బందీగా, పక్కా కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలన్నారు.
పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సోమవారం సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. కార్డుల ప్రక్రియకు సంబంధించి ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాతిపదికన ప్రాంతాల ఎంపిక పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
అక్టోబర్ 3 నుంచి 7 వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్గా మాత్రమే ఉండాలని చెప్పారు. రేషన్ కార్డు, పింఛను, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. పైలెట్ ప్రాజెక్టులో వాటిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను చేర్చడంతో పాటు కుటుంబంలో ఎవరైనా మృతి చెందింతే అలాంటి వారిని తొలగిస్తామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa