తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ రానే వచ్చింది. అక్టోబర్ 10వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగ జరగనుండగా.. రేపు (అక్టోబర్ 02వ) తారీఖున తెలంగాణ వ్యాప్తంగా పెత్తరామాస (పితృ అమావాస్య/ పెద్దల అమామాస్య) జరుపుకోనున్నారు. ఈ పెత్తరమాస సందర్భంగా.. చాలా మంది పితృ దేవతలకు బియ్యం ఇస్తుంటారు. ఈ క్రమంలో కాలం చేసిన తండ్రులు, తాతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మకు పది రోజుల ముందు.. కాలం చేసిన కుటుంబ పెద్దలను తలుచుకుని వారికి బియ్యం ఇస్తూ, అన్ని రకాల వంటకాలతో నైవేద్యాలు పెట్టటం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా.. మటన్, చికెన్తో పాటు మద్యం కూడా నైవేద్యంగా పెడుతుంటారు. అనంతరం.. కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం చేస్తుంటారు. కానీ.. రేపు నైవేద్యంగా పెట్టేందుకు ఇవేవీ దొరకవు. వైన్సులతో పాటు మాంసం దుకాణాలు కూడా తెరుచుకోవు.
ఎందుకంటే.. రేపు అక్టోబర్ 02వ తేదీ.. మహాత్మా గాంధీ జయంతి కావటంతో.. జీవ హింస, మద్యపానం నిషేధం. దీంతో.. రేపు వైన్సులతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ చేయనున్నారు. ఫలితంగా.. పెత్తరమాస వేళ తెలంగాణ ప్రజలకు పెద్ద సమస్యే వచ్చింది. దీంతో తెలంగాణ వాసులు తమ పితృ దేవతలకు శాఖాహారాన్నే నైవేద్యంగా సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా అయితే.. వైన్స్ బంద్ అయితే కేవలం మందుబాబులే బాధపడే వారు.. మాంసం దుకాణాలు బంద్ ఉంటే మాంసంప్రియులు కొంత నిరాశ చెందేవారు.. కానీ రేపు పితృ అమావాస్య కావటంతో.. దీన్ని సంప్రదాయంగా పాటించే వాళ్లంతా కొంత నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే.. ఇదే అదునుగా చేసుకుని.. అటు బెల్టు షాపులు, మరోవైపు మాంసం దుకాణాలు దొంగచాటుగా మద్యం, మాంసాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి. ప్రతి గాంధీ జయంతికి అధికారికంగా.. దేశవ్యాప్తంగా వైన్ షాపులు, మాంసం దుకాణాలు మూసివేసినా.. దొడ్డిదారిన అన్నీ సరఫరా అవుతూనే ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. అయితే.. ఈసారి గాంధీ జయంతికి తోడు పితృ అమావాస్య కూడా తోడవటంతో.. అక్రమ అమ్మకాలకు కొదవే ఉండదన్నది కూడా ఓపెన్ సీక్రెటే. మరి అటు.. మన దేశజాతిపిత అయిన గాంధీజీకి గౌరవం ఇస్తూ.. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని ఉన్నా.. ఇటు పితృ దేవతలకు నైవేద్యం పెట్టటమనే తెలంగాణ సంప్రదాయం కావటంతో ఏం చేయాలన్న డైలమాలో ప్రజలు ఉన్నారు. నిజంగానే తెలంగాణ ప్రజలకు ఈ పెత్తరమాస పెద్ద సమస్యే తెచ్చిపెట్టిందిగా..!
అయితే.. ఈ పితృ అమావాస్య సంప్రదాయం కేవలం తెలంగాణలోనే కాకుండా.. మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ పాటిస్తారని సమాచారం. మరి.. వాళ్లకు కూడా ఇదే సమస్య ఎదురుకానుంది. మరి అక్కడ కూడా పెద్దలకు తెలంగాణలోలాగానే కక్కా ముక్కా పెడతారో లేదో అన్నది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa