అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అదిపెద్ద హామీ.. రైతు ణమాఫీ. ఈ క్రమంలోనే.. జులై 18వ తేదీని మొదటి విడతగా.. లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపించింది సర్కారు. కాగా.. లక్ష నుంచి లక్షన్నర వరకు అప్పు ఉన్నోళ్లు, 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులంతా ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జూలై 31 లోపు రెండో విడత కింద లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. తిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఈ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. దీంతో.. రెండో విడతలో రుణమాఫీ కానున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. 2 లక్షల రుణాలున్న రైతులు మాత్రం ఉసూరుమంటున్నారు.
ఇదిలా ఉంటే.. కల్వకుంట్ల నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం 150 కోట్లు.. తాను చదువుకున్న తాండ్ర పాఠశాల అభివృద్ధికి 5 కోట్లు ప్రకటించారు. ఇక.. ముచ్చింతలలో రూ.100 కోట్లతో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆగస్టు 1న శ్రీకారం చుడతామని సీఎం రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల్లోని అన్ని తండాలు గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్- కల్వకుర్తి- శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు రోడ్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్రంతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
మరోవైపు.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను గెలిపించి ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటున్నారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఇబ్బందుల్లో పడింది ప్రజలు కాదు కేసీఆర్ కుటుంబం అన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయని.. గత ఎన్నికల్లో పార్టీని భుజాలపై వేసుకుని మోసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.