ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మశ్రీ సకిని రామచంద్రయ్య కన్నుమూత.. 50 ఏళ్లుగా మేడారంలో మోగిన 'డోలి' మూగబోయింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 09:45 PM

50 ఏళ్లుగా మోగిన డోలి నేడు మూగబోయింది. నిరాక్షరాస్యుడైనా.. తన పాటలు, కథలతో తరతరాల కోయ చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ వచ్చిన గోంతు శాశ్వత విశ్రాంతిలోకి జారుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ డోలి కళాకారుడు సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రయ్యా.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సకిని రామచంద్రయ్య మృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.


మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య.. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను ఓ బాధ్యతగా స్వీకరించారు. పన్నెండేండ్ల వయసులోనే 'డోలి' కళపై మక్కువ పెంచుకున్నారు. కంచు తాళం, మేళం చేతపట్టి కాళ్లకు గజ్జె కట్టి.. డోలి వాయిస్తూ కోయల చరిత్రను పాటల రూపంలో వివరించేవారుడు. తెలుగు, కోయభాషల్లో కథలు చెప్పడంలో రామచంద్రయ్య స్పెషలిస్టు.


తన పాటలు, కథలతో 50 ఏళ్లుగా తరతరాల కోయ చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తోన్న చరిత్రకారుడు.. రామచంద్రయ్య. నిరక్షరాస్యుడైనప్పటికీ.. కోయ తెగకు సంబంధించిన అనేక కథలను అలవోకగా చెప్పేవారు. సమ్మక్క సారలమ్మతో పాటు ఎంతో ఆదివాసీ యోధుల కథలను రామచంద్రయ్య గానం చేసేవారు.


  రెండేళ్లకు ఓసారి కోలాహలంగా జరిగే.. మేడారం సమ్మక్క-సారక్క జాతరలో రామచంద్రయ్య తప్పనిసరిగా ఉండాల్సిందే. అమ్మవార్ల రాక సందర్భంగా రామచంద్రయ్య డోలి వాయిస్తూ వనదేవతలకు పూజలు చేసేవాడు. 50 ఏళ్లుగా మేడారం జాతరలో వనదేవతల పుట్టుపూర్వోత్తరాలను గానం చేస్తూ వస్తున్నారు. వినసొంపైన గళంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో వేల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చారు రామచంద్రయ్య.


కోయ తెగల చరిత్రను, విశిష్టతను గానం చేస్తూ, కోయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. తద్వారా మారుమూల అటవీప్రాంతాల్లో ప్రదర్శించే అరుదైన కళాకారుడికి.. దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కినట్టయింది. డోలి కులస్థులు భద్రాచలం, ఏటూరునాగారం, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రను చెప్పే ఏకైక కళాకారుడు రామచంద్రయ్యే కావటం విశేషం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com