ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీర్ అడగటమే ఆ యువకుడు చేసిన పాపమా.. ఇంత దారుణమేంటి భయ్యా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 07:38 PM

సమాజంలో రోజు రోజుకు హింస పెరిగిపోతోంది. జనాలు విచక్షణ కోల్పోతూ.. చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతూ.. చివరికి ప్రాణాలు తీసుకునేంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇందుకు ప్రధాన కారణం మద్యమే అని చాలా మంది చెప్తుంటారు. మద్యం సేవించిన తర్వాతే కాదు.. ఆ మద్యం కొనేదగ్గర కూడా ఘర్షణలు జరగటం గమనార్హం. ఓ యువకుడు బీర్ అడిగినందుకు వైన్ షాప్ నిర్వాహకులు.. దాడి చేసి, విచక్షణారహితంగా కొట్టటగా.. చికిత్స పొందుతూ మృతి చెందటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


బీర్ అడగటమే ఆ యువకుడు చేసిన తప్పా.. కేవలం అడిగినందుకే ఇంత దారుణంగా కొట్టాలా.. అని డౌటనుమానం రావొచ్చు. అయితే.. ఆ బీర్‌ను ఎక్కువ ధరకు అమ్ముతుంటే.. ఎమ్మార్పీ రేటుకు మాత్రమే విక్రయించాలని.. అడిగినందుకు మద్యం దుకాణం నిర్వాహకులు దాడి చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ శివారులోని బండమీదిపల్లిలో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.


అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్‌ (26).. మార్చి 26న బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్‌ వద్దకు వెళ్లి బీర్‌ కావాలని షాప్‌ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల కొరత కారణంగా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో.. ఎమ్మార్పీ ధరకే అమ్మాలని.. ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారంటూ శ్రీకాంత్ నిలదీయటంతో.. మాటా మాటా పెరిగింది. రెచ్చిపోయిన వైన్స్‌ షాప్‌ నిర్వాహకులు.. మరో పది మందిని తీసుకొచ్చి శ్రీకాంత్‌ను బలవంతంగా షాపులోకి ఈడ్చుకెళ్లారు.


 పిడిగుద్దులతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయాలైన శ్రీకాంత్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాలేయం, కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్న శ్రీకాంత్ చికిత్స పొందుతూ.. సోమవారం రోజు మృతి చెందాడు. అయితే.. గొడవ జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణం నిర్వహాకులకు ఎక్సైజ్ అదికారులు, పోలీసులు సహకరిస్తున్నారని.. శ్రీకాంత్ కుటుంబసభ్యులతో పాటు , ప్రజాసంఘాలు ఆరోపణలు చేస్తున్నారు. భాద్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com