ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 07:39 PM

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈడీ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. అది నేటితో ముగుస్తుండగా.. తీహార్ జైలు నుంచే ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే.. కస్టడీ పొడిగించాలంటూ ఈడీ కోరింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి ఈడీ అధికారులు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై ఛార్జిషీట్ కూడా సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో.. కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. మళ్లీ మే 7న మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టు ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. దీంతో.. మే 7 వరకు కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు.


మరోవైపు.. కవితకు కస్టడీ పొడిగింపు అవసరం లేదని.. ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దానిపై స్పందించిన కవిత తరపు న్యాయవాది.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఆరోపిస్తునే ఉన్నారని.. కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఇదిలా ఉంటే.. లిక్కర్‌ స్కాం కేసులో తనను ఈడీ అక్రమంగా మార్చి 15వ తేదీన అరెస్ట్‌ చేసిందని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు జరగ్గా.. సాక్షాల ధ్వంసంపైనే ప్రధానంగా విచారణ కొనసాగడం గమనార్హం. డిజిటల్ ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారని ఈడీ వాదించగా.. అలాంటిదేం జరగలేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవిత ఇచ్చిన ఫోన్లలో ఎలాంటి డేటా దొరకలేని.. ఫోన్లు ఫార్మాట్‌ చేయడం వల్లే డేటా లేదంటూ ఆరోపించారు.


అయితే తాము ఎలాంటి సాక్షాలను ధ్వంసం చేయలేదని కవిత తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో.. పని మనుషులకు ఆమె ఇచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో కవిత తన ఫోన్లను స్వచ్ఛందంగా ఈడీకి అప్పగించారని చెప్పుకొచ్చారు. మరోవైపు తీహాల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే.. ఏప్రిల్‌ 11వ తేదీన కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2వ తేదీన తీర్పు వెల్లడించనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com