ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైల్‌.. ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:29 PM

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మించనున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్‌కి 50-70 కి.మీ.దూరంలో రీజినల్‌ రింగురోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 158 కి.మీ. నిడివి గల ఉత్తర భాగానికి జాతీయ నెంబర్ కేటాయించారు. కేంద్రప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంటును రూపొందించి ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది.


ఇక రీజినల్‌ రింగురోడ్డును అనుసరిస్తూ ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టును కూడా నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ ప్రాజెక్టుకు అలైన్‌మెంట్‌ రూపొందించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్‌ సర్వే పనులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇది పూర్తి కాగానే.. త్వరలోనే హెలికాప్టర్‌ ద్వారా లైడార్‌ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్‌ చేస్తూ అలైన్‌మెంట్‌ను ఫైనల్ చేయనున్నారు.


రీజినల్‌ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడివి ఉండనుండగా.. దాని చుట్టూ విస్తరించే ఔటర్ రింగ్ రైలు మాత్రం దాదాపు 536 కి.మీ నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్‌ ఓవర్‌ రైల్‌ బ్రిడ్జిలను నిర్మించన్నారు.


ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అధికారులు తేల్చారు. 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్‌ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. సగం తెలంగాణ అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం గూడ్సు ట్రైన్లు సికింద్రాబాద్‌ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్‌రింగ్‌ రైల్‌ కారిడార్‌ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com