ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనం అలా చేసినందుకే ఇలా.. కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:16 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ కావడంపై గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అంతా ఉట్టిదేనని.. ముమ్మాటికి కవిత అరెస్ట్ అక్రమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు తామ ప్రభుత్వంలో పోలీసులను పంపించామని.. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తనపై కక్ష పెంచుకున్నారని.. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారంటూ కేసీఆర్ కీలక ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.


బీఎల్ సంతోష్‌పై తాము కేసు పెట్టకపోయి ఉంటే.. ఈరోజు కవిత అరెస్టు ఉండకపోయేదంటూ కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్‌ చేశారని ధ్వజమెత్తారు. త్వరలోనే మళ్లీ పాత కేసీఆర్‌ను చూడబోతున్నారని.. ఉద్యమకాలం నాటి నాయకుడిని చూస్తారని తెలిపినట్టు సమాచారం.


మరోవైపు.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ సర్కారు మనుగడ కష్టమేనని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కనీసం 8 సీట్లు వస్తాయన్నారు. మరో మూడింటిలోనూ గెలుపు అవకాశాలున్నాయని తెలిపారు. బస్సుయాత్ర కూడా చేద్దామని తెలిపినట్టు సమాచారం. జనం నుంచి మంచి స్పందన వస్తోందని.. ఇప్పుడున్న రేవంత్‌ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఆ వ్యతిరేతను తమకు అనుకూలంగా మలుచుకోవాలంటూ సూచించినట్టు తెలుస్తోంది.


 ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిద్దామని తెలిపినట్టు సమాచారం. ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా ఏమైనా జరగొచంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు చేరిన కొద్ది రోజులకే బాధపడుతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఓ కీలక సీనియర్ నేత తనను సంప్రదించారని.. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చేందుకు కుట్ర చేశారని.. ఇప్పుడు కేవలం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బతకనిస్తారా అంటూ ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. "ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్" అని తనన్ను ఆ నేత అడిగాడన్న విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com