ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 09:14 PM

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం మొదట్లోనే.. ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. ఇక రాబోయే మే నెల గురించి ఆలోచిస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఉదయం 7 తర్వాత ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 16) తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అనేక మండలాల్లో 44.5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. నేడు, రేపు రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని.. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.


సర్రుమంటోన్న సూరీడు.. తెలంగాణలో ముదురుతోన్న ఎండలు


ఇక వడదెబ్బ కారణంగా మంగళవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన చిట్ల రామక్క (78) వడదెబ్బతో మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన సంగం సుందరయ్య (70) ఖాళీ మద్యం సీసాలు ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం కొడకండ్ల మండలం మొండ్రాయిలో సీసాలు ఏరుకుంటూ వడదెబ్బతో రోడ్డుపైనే కుప్పకూలి స్పాట్‌లోనే కన్నుమూశాడు.


ఈ జాగ్రత్తలు తీసుకోండి.


ఎండత తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్‌ ప్యాక్‌ పెట్టాలి. ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి. నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి. వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వెంటనే హాస్పటల్‌కు తీసుకువెళ్లడం ఉత్తమం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com