తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే.. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ల ప్రారంభోత్సవం పేరుతో ఆయా జిల్లాలకు వెళ్లి భారీ బహిరంగసభలు నిర్వహిస్తూ.. ప్రచారాన్ని ప్రారంభించేశారు. నిన్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన నేపథ్యంతోనూ.. బహిరంగ సభ నిర్వహించి ఎన్నికలకు శంఖారావం పూరించినట్టే కనిపించింది. ఇదిలా ఉంటే.. ఇక రెండు జాతీయ పార్టీలు కూడా దూకుడు పెంచాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోం శాఖ మంత్రి తెలంగాణలో పర్యటిస్తూ.. తనదైన శైలిలో బీజేపీలో జోష్ పెంచుతున్నారు. కాగా.. ఇప్పుడు డైరెక్టుగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్టు సమాచారం.
అక్టోబర్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో మోదీ పర్యటనకు ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ఏదో ఒకరోజు మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశముందటున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే పార్టీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొని.. వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ రోడ్ షో కూడా ఉండే అవకాశం ఉంది.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో.. మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. మోదీ పర్యటన వరకు బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశముండటంతో.. మంచి బూస్టింగ్ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే హైదరాబాద్లో రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం మాకాం వేయగా.. ఈరోజు తుక్కుగూడలో విజయ భేరీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. అంతేకాదు.. ఆరు గ్యారెంటీ హామీలు ప్రకటించి తెలంగాణ ఎన్నికలకు శంఖారావం పూరించింది. దీంతో.. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకున్నట్టే కనిపిస్తోంది.