దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కర్ణాటకలోని బెళగావి నుంచి సికింద్రాబాద్ మధ్య సర్వీసులు అందిస్తున్న (07335/ 07336) ప్రత్యేక రైలును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. 8వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలును మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక ట్రైన్ రోజూ అందుబాటులో ఉంటుంది. బెళగావి-మణుగూరు (ట్రైన్ నెంబర్.07335) మధ్యాహ్నం 1.10 గంటలకు బెళగావి రైల్వే స్టేషన్లో బయులుదేరి మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. అనంతరం ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు మణుగూరు చేరుకుంటుంది. తిరుగు పయనంలో మణుగూరు-బెళగావి (ట్రైన్ నెంబర్.07336) సాయంత్రం 3.40 గంటలకు మణుగూరు నుంచి బయలుదేరి రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. సికింద్రాబాద్లో 10.20కు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 3.55 గంటలకు బెళగావికి చేరుకుంటుంది.
సికింద్రాబాద్-మణుగూరు మధ్య భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డొర్నకల్, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లలో ఈ స్పెషల్ ట్రైన్ ఆగుతుంది. వేసవి రద్దీ కారణంగా ఈ ట్రైన్ను సికింద్రాబాద్ నుంచి మణుగూరు వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే గత కొంతకాలంగా ప్రత్యేక ట్రైన్ సర్వీసులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది.