తెలంగాణ కోసం అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా, జై బోలో తెలంగాణ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రేమాభిమానాలతో స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు... ఎండలు మండిపోతున్నా సభకు భారీగా తరలివచ్చారు అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేశాడని, తెలంగాణ కలను సాకారం చేసుకునేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయలేదని ప్రియాంక గాంధీ కీర్తించారు. ఈ సందర్భంగా ఆమె మిత్రులారా అంటూ తెలుగులో ప్రసంగించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సాకారం చేసుకునే క్రమంలో అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడివారు ఉద్యమించారని తెలిపారు. ఈ సభలో ప్రియాంక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.