ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని కోదాడ డి. ఎస్. పి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. సోమవారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పార్కు చేసిన వాహనాలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్ర మించిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపార కూడలిలో వాహనదారులు రోడ్డుకిరువైపులా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలు నిలుపుకోవాలని అందుకు దుకాణ యజమానిదారులు తమ తమ దుకాణాల ముందు నిలుపుతున్న వాహనదారులకు తప్పనిసరిగా రోడ్డు క్రిందకు పెట్టే విధంగా చెప్పాలని కోరారు.
రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు తమ వాహనాలను సురక్షిత ప్రాంతంలో నిలపాలని, లేని పక్షంలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిలిపిన వాహనాలను సిజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో అధిక జరిమానాలు విధించే అవకాశం ఉంటుందని వాహనదారులకు తెలిపారు. కోదాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సురభి రాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ డ్రైవ్ లో స్థానిక ట్రాఫిక్ పోలీసులు కొంగల వెంకటేశ్వర్లు, రామారావు, తిరుపతయ్య, తదితర స్థానిక ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.