నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిరుద్యోగ నిరసనసభ చేపడుతున్నారని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో నిరుద్యోగ యువకులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం పెద్ద ఎత్తున హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సభకు కోదాడ నుండి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి పాలిట శాపంగా మారాయి అన్నారు. నేడు జరిగే ప్రియాంక గాంధీ సభతో ప్రభుత్వాలు ఇప్పటికైనా కనులు తెరిచి నిరుద్యోగులను ఆదుకోవాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పాలనపట్ల నిరుద్యోగులు, ఉద్యోగాలు రావనే నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర రావు, నారాయణ, రేవంతన్న సైన్యం కోదాడ నియోజకవర్గ నాయకులు జలంధర్ భగత్, ప్రభాకర్, రవి, నవీన్, అశోక్, శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.