తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులకు కేంద్ర పతాకాలు వరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సైనిక, పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ వివిధ పతకాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు అందజేయనున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు, 668 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 140 మందిలో.. అత్యధికంగా 48 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.
మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకశ్మీర్ నుంచి 25, ఝార్ఖండ్ నుంచి 9, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్గఢ్ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి. అత్యున్నత రాష్ట్రపతి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ పురస్కారం.. పోలీసు దళాల్లో ఎవరికీ ప్రకటించలేదు. ఈ అవార్డుల్లో ఆంధప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 15 మందికి పోలీసు పతకాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం, 15 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం, 13 మందికి పోలీస్ విశిష్ట సేవాల పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనపు డీజీ అతుల్ సింగ్, 6వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటరావు, తెలంగాణ (Telangana) నుంచి అదనపు డీజీ అనిల్ కుమార్, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ బృంగి రామకృష్ణకు రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు