ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని బహదూర్ పూర ట్రాఫిక్ సీఐ కె.సునీల్ వెల్లడించారు. రోడ్డుపై వచ్చే ప్రతి వాహనం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా తమ గమ్యం చేరుకోవాలన్నదే తమ అసలు ఉద్దేశమని ఆయన వెల్లడించారు. రోడ్డుపై ట్రాఫిక్ ఉల్లంఘనలతోనే రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు ఇబ్బందులకు గురవుతున్నాడని, అందుకోసమే తాము ట్రాఫిక్ పై ప్రత్యేక నజర్ పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ కు పూర్తి సౌకర్యం కల్పించబోతున్నామని, అంతేకాకుండా సిగ్నల్ వద్ద స్టాప్ లైన్ దాట కుండా ప్రతి వాహనంను కట్టడి చేస్తామన్నారు. వాహనదారులే ఈ నిబంధనలను పాటించేలా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తాము, ట్రాఫిక్ ఎస్సై, పోలీసులు ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టామని కె.సునీల్ వెల్లడించారు. ఈ నిబంధనల గురించి మీరు మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు కూడా తెలియజేయాలని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదార్లకు దీనిపై విన్నపం కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో తమకు ఈ ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియదన్న మాట వాహనదారుడి నుంచి వినబడకూడదన్న ఉద్దేశంతో ఇలా అవగాహన కార్యక్రమం చేపట్టి వాహనదారులలో చైతన్యం నింపుతున్నామన్నారు. ఇందుకు మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి యాక్సిడెంట్ లకు అవకాశముండదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కూడా ప్రత్యేక నజర్ పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. తమ బహదూర్ పూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ప్రతి హోటల్ తోపాటు ఇతర దుకాణ సముదాయానికి కూడా వారికి సంబంధించిన స్థలంలో కాకుండా రోడ్డుపై పార్కింగ్ చేస్తే కఠిన చర్యలుంటాయని తెలియజేశామన్నారు. పార్కింగ్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, దుకాణ సముదాయ యజమానులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామన్నారు. గతంలో తాను టప్పచబుత్రా, పంజాగుట్టా, ఎల్.బీ.నగర్, హుమాయన్ నగర్, సరూర్ నగర్ లోని చైతనపురి పోలీస్ట్ స్టేషన్ పరిధిలో పనిచేశానని ఆ అనుభవంతో బహుదూర్ పూరాలోనూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని ట్రాఫిక్ సీఐ కె.సునీల్ వెల్లడించారు.