ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను ఓ ఫొటో స్టూడియోలో పని చేస్తున్న యువకుడు అపహరించిన ఘటన గురువారం చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా మధిర ప్రధాన వీధిలో పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఫొటో స్టూడియోలో డిజైనింగ్ వర్క్ చేస్తున్న కడపకు చెందిన వరికూటి బాల గురివిరెడ్డి (34) స్టేషన్ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నాడు. ఆ ఇంటి యజమాని కూతురు 9 వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మాయమాటలు చెప్పి తనతో తీసుకుని వెళ్లాడు. తెల్లవారేసరికి కూతురు కనిపించకపోవడంతో వెతికి చివరకు తమ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు.
అందులో యువకుడు గోడ దూకిన దృశ్యం కనిపించడంతో అతనే అపహరించి తీసుకెళ్లినట్లు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. నిందితుడు గతంలో కూడా ఓ బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నట్టు సమాచారం. ఫోటో షూట్ల పేరుతో బాలికలు, యువతుల బలహీనతలను అదనుగా చేసుకుని వారిని వ్యభిచార ఉచ్చులోకి దింపుతున్నట్లు తెలిసింది. లడ్డాక్, గోవా, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లి సెక్స్ రాకెట్ నడుతున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా ఈ తతంగం నడుస్తోండగా. తాజాగా కిడ్నాప్ వ్యవహారంతో వీరి ఆగడాలపై చర్చ జరుగుతోంది.